Off The Record: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి మధ్య గ్యాప్ పెరిగిందా అంటే… ఎస్.. అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఆలయ పునర్నిర్మాణం, స్వయంభూ దర్శనాలు ప్రారంభమయ్యాక ఇక్కడ స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశిస్తే… సీన్ రివర్స్ అయిందట. అదే ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం అవుతోందట. దీనికి తోడు ఆలయ పునర్ నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి ఎమ్మెల్యే… స్థానికులకు ఉపయోగపడే పలు సూచనలు, సలహాలు ఇచ్చినా.. ఈవో పక్కనపెట్టడం మరో కారణం అన్నది లోకల్ టాక్. ప్రభుత్వ విప్ హోదాలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే విషయంలో ఈవో ప్రోటోకాల్ పాటించడం లేదని, పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి విషయంలో అధికారికి అంత నిర్లక్ష్యం ఏంటన్న చర్చ కూడా కొండ మీద జరుగుతోందట.
యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం కంటే ముందే ఈవోగా బాధ్యతలు స్వీకరించిన గీతారెడ్డి పనుల్లో అంతా తానే అన్నట్టు వ్యవహరించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తోనూ, సీఎంఓలోని సీనియర్ అధికారులతోను నేరుగా సంబంధాలు ఏర్పడ్డాయని, అవే ఈ వ్యవహారశైలికి కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే విషయంలో లైట్ తీసుకోవడానికి కూడా అదే కారణమట. పునర్నిర్మాణ సమయంలో కొండ మీద షాపులు కోల్పోయిన వారు, ఆలయానికి వచ్చే రోడ్డు విస్తరణలో ఉపాధి అవకాశాలు పోయిన వారు, కొండ మీదికి ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే వారంతా తమకు న్యాయం చేయాలంటూ… ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. ఈవో కారణంగానే… నేను ఏమీ చేయలేకపోతున్నానని, ఖచ్చితంగా ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే వారితో బహిరంగంగానే చెప్పడం, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అంతా విస్తుపోయారట.
యాదాద్రి ఆలయాన్ని నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. పునర్ నిర్మాణంలో భాగంగా కొందరు ఉపాధి కోల్పోగా… మరి కొందరి జీవితాల్లో మార్పులు జరిగాయి. వీరికి న్యాయం చేసే విషయంలో తాను చేసిన ఏ సూచనను ఈఓ పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారట ఎమ్మెల్యే సునీత మహేందర్రెడ్డి. ఆటోలను కొండపైకి అనుమతించే విషయంలో స్దానిక యువతను దృష్టిలో ఉంచుకోవాలన్న సూచననూ పట్టించుకోలేదట… పాత బస్టాండ్ ను కొనసాగించాలన్న స్థానికుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమట.. ఆలయ పునర్నిర్మాణం జరిగి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే…తాను స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయాననే ఆవేదన ఆమెను వెంటాడుతోందట. బాధితులంతా పలుమార్లు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకెళ్ళి వేడుకోవడం, ధర్నాలు కూడా చేసిన సందర్భాల్లో నావల్ల కావడం లేదని, అంతా ఆమె వల్లేనని చెప్పేస్తున్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు సమాధానంచెప్పుకోలేక….. వారికి న్యాయం చేయలేక… తన ఇబ్బందుల్ని కనిపించిన ఎమ్మెల్యేకు, ఎదురుపడిన మంత్రికల్లా మొరపెట్టుకుంటున్నారట గొంగిడి.
ఇద్దరి మధ్య వివాదం ఇలా ఉంటే… అనాదిగా వస్తున్న ఆలయ దర్శనాలు, సాంప్రదాయలను ఈవో పక్కన పెట్టడంపై స్దానిక ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారట. ఇటీవల స్వామివారి చక్రస్నానం సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొండ కిందే స్నానాలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఈవో తన బంధువులతో కలిసి కొండ మీద పుష్కరిణిలో చక్రస్నానం చేయడంపై ఆలయ ఉద్యోగులు సైతం గుర్రుగా ఉన్నారట.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాదాద్రి ఆలయం పున్నర్ నిర్మాణం పూర్తయి స్వయంభూ దర్శనాలు ప్రారంభం కావడంపై సంతోషంగా ఉన్నప్పటికీ…. పునర్ నిర్మాణం ద్వారా తాము లబ్ది పొందలేదన్న అసంతృప్తి స్థానికుల్లో తీవ్రంగా ఉందట. ఈవో కారణంగానే ఆ పరిస్థితి వచ్చిందన్న ఆవేదన ఎమ్మెల్యేకు ఉందట. ఇది ఇలాగే ఉంటే… వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా మారిపోతాయోన్నన భయం కూడా ఆమెలో పెరుగుతోందట. దీంతో తన మనోవేదనను కనిపించిన ఎమ్మెల్యే, మంత్రికల్లా చెప్పుకుంటున్నారట గొంగిడి. మరి ఆ గోడు కనీసం దేవుడైనా వింటాడో లేదో చూడాలి.