టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) థియేటర్లలోకి వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, మారి దర్శకత్వం వహించారు. వరంగల్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్తో మొదలైన జోరు, నేడు విడుదల తర్వాత సోషల్ మీడియాలో వినిపిస్తున్న పాజిటివ్ టాక్తో మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ నవీన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Tamannaah : తమన్నా సినిమాకు గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ వార్నింగ్..
నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ విడుదల సమయంలో మాకు కనీసం షోలు కూడా దొరకని పరిస్థితి. కేవలం 10 షోలు మాత్రమే ఇస్తామన్నారు. కానీ ప్రేక్షకులు ఆ సినిమాను భుజాల మీద మోసి పెద్ద హిట్ చేశారు. ఆ నమ్మకమే నేడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఆలస్యమైనా సరే, ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతోనే కష్టపడ్డామని, ప్రత్యేక షోలు చూసిన ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుకున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.