అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక కొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Vivo V70 Price: ‘వివో వీ70’ ప్రీబుకింగ్స్ ప్రారంభం.. అధికారిక ధర, స్పెక్స్ డీటెయిల్స్ ఇవే!
బడ్జెట్ సమావేశాల సమయంలో రోజుకో పార్లమెంటు పరిధికి చెందిన సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వారి కుటుంబ సభ్యులతో డిన్నర్ మీటింగ్లు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో నేతల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారి నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించి పరిష్కార మార్గాలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ప్రతిరోజు సాయంత్రం ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కావాలని కూడా మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఇవాళ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ఆయా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ కొత్త విధానం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులతో వ్యక్తిగతంగా మమేకమవుతూ పరిపాలనలో సమన్వయం పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.