కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు మాత్రం హత్యగా ఆరోపిస్తున్నారు. భర్త యేసు తన ముగ్గురు పిల్లలతో పాటు రెండో భార్యను చెరువులో తోసి హత్య చేశాడని చిన్నారుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్తో ఆసుపత్రి ఎదుట మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
READ MORE: Crime News: గుంటూరు జిల్లాలో దారుణం.. బాలుడిని గోడకేసి కొట్టి చంపిన మారుతల్లి
ఈ ఘటనలో మృతులు మొదటి భార్య పిల్లలు మైథిలి, వినయ్, అక్షర, అలాగే రెండో భార్య మౌనికగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే, ఐదేళ్ల క్రితం భర్త యేసు తన మొదటి భార్య శ్యామలను కొట్టి చంపాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కేసు విచారణలో ఏమైనా లోపాలున్నాయా? ప్రస్తుతం జరిగిన ఘటనకి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి, నిశితంగా దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి, అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల విచారణ తరువాత మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
READ MORE: Bandi Sanjay: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ‘పింక్ వైరస్’.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’!