MP Balashowry Vallabbhaneni Revels Why He Is Joining Janasena: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా జరగలేదు అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధిపై స్పందించడం లేదన్నారు. రాష్ట్రంను అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే జనసేనతో కలిసి నడుస్తున్నానని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానన్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆదివారం జనసేనలో చేరనున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ… ‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని. వైఎస్ ఎంతో గొప్ప వ్యక్తి. రాజశేఖర్ రెడ్డితో ఏ నాయకుడిని పోల్చలేము. నేను రాజకీయాల్లో క్రమశిక్షణగా ఉంటాను కాబట్టి ఎవరికైనా నచ్చుతాను. అందరితో సన్నిహితంగా ఉంటాను. వైయస్ హయాంలో డెల్టాకు జీవనాధారమైన పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని భావించా. కానీ డయాఫం వాల్ రిపేరు పేరుతో రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది’ అని అన్నారు.
Also Read: TDP-Janasena Alliance: ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్!
‘కొన్ని కేంద్ర పథకాలకు మాచింగ్ గ్రాంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకువచ్చా. అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్తితి లేదు. అందుకే వైసీపీ నుంచి పక్కకు వచ్చేసా. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది. అభివృద్ధి శూన్యంగా ఉంది. అందుకే ఈ రాష్ట్రం ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందో వారితోనే పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకే జనసేనలో చేరుతున్నా’ అని ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు.