Extra-Marital Affair: జార్ఖండ్లోని బొకారో జిల్లాలో దారుణం జరిగింది. తమ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది. ఈ ఘటన బొకారో జిల్లాలోని మహుటాండ్ పీఎస్ పరిధిలోని ధ్వయ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. అనంతరం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి ముస్లిమేతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గ్రామస్థులు ఆగ్రహంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు ఓ వార్డు మెంబర్ అని తెలిపారు. గురువారం జరిగిన దుర్గాదేవీ నిమజ్జనం సమయంలో ఓ వర్గానికి చెందిన 22 మంది మరో వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారు. ఫలితంగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Ravan Dahan: ఇదెక్కడి విడ్డూరం.. రావణుడి పది తలలు దగ్ధం కాలేదని గుమస్తాపై వేటు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడికి ధ్వయ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొందరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి దుర్గామాత నిమజ్జనం సమయంలో అదును చూసి మూకదాడికి పాల్పడ్డారు. బాధితుడికి తీవ్ర గాయలవ్వగా.. రామ్ఘఢ్ ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. బాధితుడి ఆరోగ్యం విషమించడం వల్ల రాంచీలోని ఓ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసులో 22 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.