Minister Narayana: అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీటిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లని వేరే అవసరాలకు వినియోగించుకుందన్నారు. కండిషన్లో లేని నాటి అన్న క్యాంటీన్ల భవనాలను రెన్నోవేట్ చేయాలని ఆదేశించామన్నారు. రూ. 73కు మూడు పూటల భోజనం పెడతామని ఇస్కాన్ చెప్పిందన్నారు. కానీ మేం పేదలను దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై రూ. 5 భోజనం పెట్టామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Minister Satya Kumar: వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్య కుమార్ యాదవ్.
రూ. 58 మేం ఇస్కాన్కు నాటి టీడీపీ ప్రభుత్వం తరపున చెల్లించిందన్నారు. అప్పట్లో రోజుకు 2.25 లక్షల మంది భోజనం చేసేవారని.. టీడీపీ హయాంలో 4.25 కోట్ల మంది అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇస్కాన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇస్కాన్ కే అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత ఇవ్వొచ్చా..? లేదా.. వేరే టెండర్లను పిలవాలా..? అనే అంశంపై చర్చిస్తున్నామన్నారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించగలమని ఇస్కాన్ ప్రతినిధులు చెప్పారన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇస్కాన్ సంస్థకున్న సెంట్రలైజ్డ్ కిచెన్స్ కూడా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లాయని విమర్శించారు.