Somireddy vs Kakani: జనసేన-బీజేపీ కూటమితో కలిసి ఎన్నికలకు సిద్ధం అవుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు మూడో జాబితాను విడుదల చేసింది.. అయితే, ఈ సారి మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి టికెట్ వస్తుందా? రాదా? అనే చర్చ సాగింది.. కానీ, మూడో జాబితాలో ఆయనకు చోటు దక్కింది.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ సీటును సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. మొదటి, రెండు జాబితాల్లో సోమిరెడ్డికి చోటు దక్కకపోయినా.. మూడో జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. దీనిపై సోమిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.. ఇక, ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు.. మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్రెడ్డి కూడా ఈ పరిణామాలపై ఆనందం వ్యక్తం చేశారు.
సోమిరెడ్డికి టీడీపీ టికెట్ రావడంపై వంగ్యాస్త్రాలు సంధించిన మంత్రి కాకాణి… సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం అన్నారు. వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారు.. రెండు జాబితాల్లో చోటు దక్కలేదు.. సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికి.. టికెట్ రావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే నేను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా అని అనుకున్నాను అన్నారు. కొత్తవాళ్లైతే విమర్శలు చేయడం కష్టం.. ఇక నా ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయి వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇదే చివరి ఎన్నిక అని సోమిరెడ్డి చెబుతున్నారు.. అంటే ఓటు వేస్తే వేయండి.. లేకుంటే లేదని అంటున్నారు అని ఎద్దేవా చేశారు. అయితే, ఆయనను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు మంత్రి కాకాణి.
ఇక, రాజకీయంగా పరిణితి చెందిన సోమిరెడ్డి.. జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదు అని హితవుపలికారు కాకాణి.. సైదాపురంలో అక్రమ గనుల తవ్వకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాన్నారు.. దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి అని సూచించారు. అక్రమ మైనింగ్ పై విచారణ జరపాలని నేను ప్రభుత్వానికి లేఖ రాశా.. సైదాపురంలో గనుల యజమానుల వద్ద సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. పొదలకూరులో 500 కోట్ల విలువైన తెల్లరాయిని తవ్వి స్టాక్ చేసారని సోమిరెడ్డి ఆరోపించారు. రూ.5 కోట్లు ఆయన చెల్లిస్తే.. ఆ స్టాక్ ఇచ్చేలా ప్రభుత్వం.. ఎన్నికల సంఘాన్ని కోరుతా.. దీనికి సోమిరెడ్డి సిద్ధమా? అని సవాల్ చేశారు. అక్రమ మైనింగ్ పై విచారణ కు రావాలి.. యాష్ పాండ్ లో కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆయన.. గతంలో ఆయన మద్దతుదారులు ఇసుకను అక్రమంగా రవాణా చేశారు.. కోర్టులో దొంగతనం పై సీబీఐ విచారణ నేను కోరాను, ఆ కేసులో సీబీఐ నా పాత్ర లేదని తేల్చింది.. దీనిని కూడా సోమిరెడ్డి సహించలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.