వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో జేపీ నడ్డా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ‘చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 24 అంతస్తుల్లో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసింది. వెనువెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి, శర వేగంగా పనులు ప్రారంభించింది. మూడు నెలల్లోనే 15 శాతం పనులు పూర్తయ్యాయి. కండ్లుండీ చూడలేని వారికి ఈ అభివృద్ధి కనిపించదు. నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసే వారికి ఈ హాస్పిటల్ వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం కావు. వరంగల్ లో నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి మాత్రమే కాదు.. ప్రభుత్వ రంగంలో దేశంలోనే నిర్మించబడుతున్న ఒకే ఒక అధునాతన హెల్త్ సిటీ.
ఇది పూర్తయితే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందటంతో పాటు వైద్య విద్య , పరిశోధనలకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుంది.’ అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అయితే.. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మూడో దశ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను వరంగల్లో నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. అయితే.. జేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. పై విధంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.