Bangladesh- Mamata Banerjee: బంగ్లాదేశ్లో తాత్కాలిక సారథి యూనస్ శకం ముగిసింది. తాజాగా జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత తారిక్ రహ్మాన్ ఘన విజయం సాధించారు. ఇప్పటికే మన దేశ ప్రధాని మోడీ తారిక్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. బంగ్లాదేశ్ పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తారిక్కు గిఫ్ట్ పంపారు. ప్రత్యేకంగా పూలు, మిఠాయిలు పంపించి అభినందనలు తెలిపారు. ఈ బహుమతులను ఢాకాలోని గుల్షన్లోని పార్టీ కార్యాలయంలో బీఎన్పీ ప్రతినిధులు స్వీకరించారు. ఇదివరకే ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రమజాన్ శుభాకాంక్షలు ముందుగానే చెప్పారు. తారిక్ రహ్మాన్ను “తారిక్ భాయ్” అని పిలుస్తూ.. పార్టీ విజయంపై ప్రత్యేక అభినందనలు చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇలాగే బలంగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Mitchell Starc: భారత్ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి.. స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ గురువారం ముగిసింది. అనంతరం బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం 300 స్థానాల్లో 297 స్థానాల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. అందులో బీఎన్పీ, దాని మిత్రపక్షాలు కలిసి 212 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించాయి. జమాత్-ఎ-ఇస్లామీ ఆధ్వర్యంలోని 11 పార్టీల కూటమి 77 స్థానాలు గెలుచుకుంది. ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ ఒక స్థానం దక్కించుకోగా, స్వతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టైంది. ఒకవైపు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆప్యాయ శుభాకాంక్షలు, మరోవైపు భారత ప్రధాని అభినందనలు తెలపడం ఆసక్తికరంగా మారింది. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
READ MORE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ మైలేజ్.. త్వరలో Tata Punch EV లాంచ్