Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న తాజా సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. శనివారం నాడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సోనార్పూర్లో పర్యటించగా, అక్కడ ఉగ్రరూపం దాల్చిన ఒక గుంపు ఆయనపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ ఆకస్మిక దాడిలో అభిషేక్ బెనర్జీ గాయపడ్డారు.. అభిషేక్ను చుట్టుముట్టిన జనాలు విపరీతంగా రాళ్లు, గుడ్లు విసురుతున్నప్పటికీ భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, ఆయనకు హెల్మెట్ ధరింపజేసి అత్యంత కష్టమ్మీద అక్కడి నుంచి సురక్షితంగా బయటపడేశారు.
ఈ హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత తీవ్రంగా స్పందించారు. దాడి అనంతరం అభిషేక్ బెనర్జీని చికిత్స నిమిత్తం చేర్పించిన ‘బెలె వ్యూ’ ఆసుపత్రి సిబ్బందిని ఆమె బెదిరించినట్లు ఒక ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బెంగాలీ భాషలో ఉన్న ఆ ఆడియో సంభాషణలో.. “దేవుడు మిమ్మల్ని క్షమించడు.. మీరు హాస్పిటల్ నడుపుతున్నారు, ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.. కానీ రేపు గనుక కేంద్రంలో ఆ ప్రభుత్వం లేకపోతే, మేమేంటో మీకు చూపిస్తాం (మేము దీనిని చూసుకుంటాం)” అని మమతా బెనర్జీ హెచ్చరించినట్లు వినబడుతోంది. అంతేకాకుండా, హాస్పిటల్ యాజమాన్యం తీరుపై, రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు అభిషేక్ బెనర్జీ పరిస్థితి విషమంగా లేనప్పుడు ఐటీయూ (ITU) లో ఎందుకు ఉంచారు? ఒకవేళ పరిస్థితి సీరియస్ గానే ఉంటే, ఇప్పుడు ఎవరి ఒత్తిడికి తలొగ్గి డిశ్చార్జ్ చేశారంటూ నిలదీశారు. దీనిని భద్రతా పరమైన అతిపెద్ద లోపంగా దీదీ అభివర్ణించారు. అభిషేక్ శరీరంలో రక్తం గడ్డకట్టిందని, ఒకవేళ సమయానికి అభిషేక్ హెల్మెట్ ధరించకపోయి ఉంటే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై అభిషేక్కు ఆసుపత్రి తరహాలోనే ఇంట్లోనే చికిత్స అందిస్తామని, ఇందుకోసం ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర అవసరమైన వైద్య పరికరాలను ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. భవిష్యత్తులో అభిషేక్ ఆరోగ్యానికి ఏ చిన్న ముప్పు వాటిల్లినా దానికి ఆ ఆసుపత్రి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ‘ప్రజాస్వామ్య హత్య’గా అభివర్ణించిన ఆమె, ఈ ప్రభుత్వం ప్రజల మద్దతుతో మారలేదని, దీనిని బలవంతంగా మార్చారని ఆరోపించారు. బెంగాల్లోని స్థానిక విపక్ష నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఢిల్లీలోని బీజేపీ నాయకులు సైతం ఇక్కడి బెంగాల్ నాయకులంత దుర్మార్గులు కారని విమర్శించారు. అలాగే రాష్ట్ర సీఐడీ (CID) ని కూడా ఆమె ‘పిరికిపందలు’ అని సంబోధిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
