Maldives President: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జూ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఎన్డీయే కూటమి తరఫున లోక్సభాపక్ష నేతగా ఎన్నికైన మోడీ రేపు (జూన్ 9న) ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ముయిజ్జూ ఇవాళే (శనివారం) ఢిల్లీకి చేరుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే, భారత్ పర్యటనపై మాల్దీవుల అధ్యక్ష భవనం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ కాలేదు.
Read Also: NZ vs AFG: వరల్డ్ కప్లో న్యూజిలాండ్కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్..
అయితే, మరోవైపు ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోడీని.. ఎక్స్ వేదికగా బుధవారం మహ్మద్ ముయిజ్జూ అభినందనలు తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శ్రేయస్సు, స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా కలిసి పని చేసేందుకు తాను రెడీగా ఉన్నట్లు ఆయన ఆ పోస్టులో వెల్లడించారు. ఒకవేళ మాల్దీవుల అధ్యక్షుడు భారత్కు వస్తే.. ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మన దేశంలో ఆయన తొలి అధికారిక పర్యటన ఇదే అవుతుంది.
Read Also: Ramoji Rao: రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?
కాగా, గతేడాది నవంబర్ 17వ తేదీన మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ.. చైనా అనుకూల విధానాలను అనుసరిస్తున్నాడు. ఇండియాతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పాటు మాల్దీవుల మంత్రులు మోడీపై చేసిన విమర్శలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. దీంతో పాటు మాల్దీవులలో ఉన్న భారత సైన్యాన్ని పూర్తికి వెనక్కి పంపించేశాడు. ఇక, మోడీ ప్రమాణస్వీకారానికి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాధినేతలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు వారికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తుంది.