Mallikarjun Kharge on PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు భయపడి మణిపుర్ వెళ్లలేదని, తమ నేత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరని విమర్శించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోడీ ని గద్దె దించాలని ఖర్గే పిలుపునిచ్చారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు.
మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నాం. దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా దీన్ని ప్రజలు గుర్తుంచుకుంటారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలు మేనిఫెస్టోలో ఉన్నాయి. మేం చేయగలిగిన అంశాలనే మేనిఫెస్టోలో చేర్చాం. ప్రధాని మోడీ హయాంలో ఒక్కటైనా పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చారా?. కేవలం తిట్లు తప్పితే.. మోడీ పాలనలో మరేమీ వినలేదు’ అని అన్నారు.
Also Read: Sumalatha Ambareesh: బీజేపీలో చేరిన సీనియర్ నటి సుమలత!
‘మోడీ సర్కార్ విపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారు. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీపై రూ.3,500 కోట్ల జరిమానాలు విధించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోడీని గద్దె దించాలి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి.. పార్టీ హామీలును వారికి వివరించాలి. అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని.. బీజేపీ మమ్మల్ని నిందిస్తోంది. ప్రధాని ఇప్పటివరకు భయపడి మణిపుర్ వెళ్లలేదు. మా నేత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరు’ అని ఖర్గే విమర్శించారు.