KTR TOUR: ములుగు జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, దాని పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని ములుగు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.30లక్షలతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ, రూ.15 లక్షలతో నిర్మించే సమాచార పౌరసంబంధాల శాఖ మీటింగ్ హాల్ పనులకు శంకుస్థాపనలు, జిల్లా కేంద్రంలో రూ.2కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.