పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని, శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలన్నారు. శాసనమండలి సభ్యులు కూడా ఇప్పటికే ఆప్ట్ చేసుకున్న తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి పోలీట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారన్నారు కేటీఆర్.
చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని, జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు పార్టీ సంసిద్ధంగా ఉండాలన్నారు. త్వరలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుంది… అందులో శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.