KTR: దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారని.. కేసీఆర్ను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోందని విమర్శించారు.
ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయం అయిందని.. తెలంగాణ తల్లిలో బతుకమ్మ మాయం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని రేవంత్ రెడ్డికి అర్థం అయిందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తే మీకు పరిపాలన రాదని అన్నారని.. పదేళ్ళలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ భాషను, యాసను వెక్కిరించారన్నారు. ఇందిరాగాంధీ భారతమాతను హరిద్వార్లో ఏర్పాటు చేశారన్నారు. సమైక్య పాలకులు పగబడితే 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. హంతకులే సంతాపం తెలిపినట్లు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్ళు తెలంగాణ తల్లి బీదగా ఉండాలని రూపాన్ని మార్చారంటూ కేటీఆర్ విమర్శించారు. ప్రపంచంలో ఆలిని మార్చిన వాళ్ళు ఉన్నారు.. కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ఎవరూ లేరని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Read Also: CM Revanth Reddy: మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణ తల్లి
తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు మార్చమన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి విగ్రహం మారాలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం చేస్తారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనబడుతోందన్నారు. తెలంగాణ అస్తిత్వం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన వంద సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కా అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపుతామన్నారు. సెక్రటేరియట్లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపడం పక్కా అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో సాంస్కృతిక విప్లవం రావాలన్నారు. నేడు జరిగిన అపచారానికి ప్రజలు ఏకం కావాలన్నారు.
ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుందామని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేద్దామంటూ సూచించారు. రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారని కేటీఆర్ అన్నారు. ఘట్కేసర్ రైతు కోఆపరేటివ్ సొసైటిలో 1190 మంది రైతులు ఉంటే ఒక్కరికి రుణమాఫీ కాలేదన్నారు. వచ్చే సంవత్సరం పార్టీని పునర్నిర్మాణం చేసుకుందామని కేటీఆర్ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. పార్టీ మెంబర్ షిప్ ప్రారంభిద్దామని పేర్కొన్నారు.