Komatireddy Venkat Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారణం చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడర్గా రేవంత్రెడ్డిని ఎన్నుకున్నారని.. ఎల్లుండి ప్రమాణస్వీకారం చేస్తారంటూ కేసీ వేణుగోపాల్ ప్రకటించిన విషయం విదితమే.. ఇక, కాబోయే సీఎంకు పార్టీ నేతలు, లీడర్లు, ఇతర పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాక్షంలతో ముంచెత్తుతున్నారు.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ, నల్గొండ శాసన సభ స్థానం నుంచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి..
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం అన్నారు కోమటిరెడ్డి.. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక ఇది.. తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్గా సారథ్యం వహించి, నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపికవడం హర్షణీయం.. అందుకు సోదరుడు రేంవత్ రెడ్డికి నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు. అవ్వన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు అని పేర్కొన్నారు కోమటిరెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యార్థి పార్టీలు విమర్శలు చేశాయి. కానీ, కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం. ఇదే సిద్దాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, అదిష్టానానికి తీర్మానం పంపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి, పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రధాన్యానికి ఇది సంకేతం. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది. సోదరుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజాఅనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది. సోదరుడు రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.