Kishan Reddy : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి.. జరిగిన దాడిని ఖండిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పందించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగ రాజన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని ఆయన కొనియాడారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న రంగరాజన్.. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు కిషన్ రెడ్డి.
సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. భారతీయ జనతాపార్టీ రంగరాజన్కి అన్నిరకాలుగా అండగా నిలబడుతుందని ఆయన భరోసా కల్పించారు. అయితే.. ఇదిలా ఉంటే.. చిలుకూరు బాలాజీ దేవాలయంకి బీజేపీ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ నేతలు రంగరాజన్ను పరామర్శించనున్నారు.
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..