భారీవర్షాలు కురిశాయి… గోదావరికి వరదలు వచ్చి విలీన మండలాల వాసులు వరద నీటిలో కొంతకాలం పాటు జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. వరదల వల్ల ఇళ్ళలో మట్టి, బురద నిండిపోయింది. దీంతో దోమల బెడద జనాన్ని ఇబ్బంది పెట్టింది. తాజాగా అల్లూరి జిల్లా విలీన మండలాల ప్రజలు విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతూరు మండలం కుయుగూరు గ్రామానికి చెందిన కారం సంధ్య అనే పదేళ్ల బాలిక జ్వరం కారణంగా మృతి చెందింది.
దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల సంభవించిన వరదలు విలీన మండలాల్లో సుమారు 45 రోజుల పాటు నిలిచి తగ్గిన తర్వాత ఇక్కడి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. తాజాగా కుయుగూరు గ్రామానికి చెందిన సంధ్య అనే బాలిక జ్వరంతో బాధ పడుతూ మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఈ బాలిక గత నెల 27 వ తేదీన సి.ఎం.జగన్ కుయుగూరు వచ్చినప్పుడు పూర్తిగా ఆయనతోనే ఉంది. సి.ఎం.సంధ్యని పిలిచి మరీ తనతోనే ఉంచుకోవడం విశేషం. అయితే ఈ ప్రాంతంలో జ్వరాలు దయనీయమైన పరిస్థితులను నెలకొల్పుతున్నాయని, దీనికి కారణం సకాలంలో సరైన వైద్యం అందకపోవడమే అని పలువురు ఆరోపిస్తున్నారు.
Read Also: Rope Ways in AP: ఏపీకి రోప్ వే హంగులు.. ఎక్కడెక్కడ అంటే?
ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో మందులు లేకపోవడంపై జనం మండిపడుతున్నారు. దీంతో పాటు వైద్యుల కొరత కూడా ఇందుకు కారణం అని అంటున్నారు. వెంటనే వెంటనే విలీన మండలాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు,నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విషజ్వరాలను తేలికగా తీసుకుంటే తర్వాత అనేక ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు.మారుతున్న వాతావరణం పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తక్షణ ప్రభావం చూపుతుంది. వేడినీటిని తాగడం, బయట ఆహార పదార్దాలు తినకుండా వుండడం చేయాలంటున్నారు. ఎడతెగకుండా జ్వరం బాధిస్తుంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.