ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదన్నారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నదని, కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ . అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాగా, కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే లిక్కర్ కేసు, జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అంతకుముందే కవితను కూడా ఈడీ అరెస్టు చేసింది. ఎన్నికల వేళ ఈ అరెస్టులు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.