భారత్-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ భౌతికకాయం సొంతూరికి చేరింది. భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు అతడి ఇంటికి చేర్చారు. మురళీ భౌతికకాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డంతాండ పంచాయతీ కల్లితాండాకు ఆర్మీ అధికారులు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహం చూసి మురళీ తల్లిదండ్రులు బోరున ఏడుస్తున్నారు. మురళీ భౌతికకాయంను చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు.
జవాన్ మురళీ నాయక్ను కడసారి చూడటానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. చేతిలో మువ్వన్నెల జెండా పట్టుకుని ‘భారత మాతకు జై’, ‘జై జవాన్’, ‘మురళీ నాయక్ అమర్ రహ హే’ అంటూ నినాదాలు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ మురళీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం అధికారులు ఉంచారు. ఆదివారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురళీ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకొస్తున్న సమయంలోనూ రోడ్డు పొడవునా జనాలు జననీరాజనం పట్టారు.