Vijayawada West: ఏపీల బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేపడుతోంది. పశ్చిమ సీటు బీజేపీకి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో జనసేన నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీ అధినేత పవన్ను కలిశారు. సీటు విషయంలో న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు పశ్చిమ నుంచి పోటీ చేయటానికి బీజేపీ ఆశావహులు సిద్ధమవుతున్నారు. బీజేపీ నేతలు పోటా పోటీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ సీటు ఇమ్మంటే ఓడిపోయే పశ్చిమ సీటును ఇస్తున్నారు.. వద్దని మరికొందరు బీజేపీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ, జనసేన అధిష్ఠానాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Read Also: YSRCP MLA Rachamallu : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
ఇదిలా ఉండగా.. బెజవాడ పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తుల్లో పశ్చిమ సీటు బీజేపీకి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట బల ప్రదర్శనలు చేపట్టారు. వెస్ట్ టిక్కెట్ తనదే అంటున్న వక్కలగడ్డ భాస్కర్.. ఇటీవల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా తెరపైకి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు.