కర్ణాటకలో మరోసారి పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఆ మధ్య కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు వినబడినట్లు వార్తలు కలకలం రేపాయి. తాజాగా బెళగావి న్యాయస్థాన ప్రాంగణంలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు సంచలనంగా మారింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ గ్యాంగ్స్టర్ జయేశ్ పూజారి బెళగావి న్యాయస్థాన ప్రాంగణంలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసు విచారణలో భాగంగా గ్యాంగ్స్టర్ జయేశ్ పూజారిని కోర్టుకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. పాక్ నినాదాలు చేయడంతో అక్కడున్నవారు అతడిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.
గ్యాంగ్స్టర్ జయేశ్ పూజారిపై హత్య, బెదిరింపులు వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో దోషిగా తేలిన అతడు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ క్రమంలో 2018 నాటికి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా పూజారిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. లోపలికి వెళుతుండగా అతడు సడన్గా పాక్ అనుకూల నినాదాలు చేశాడు. దీంతో భద్రత కల్పించిన పోలీసులు అతడిని అక్కడినుంచి తరలించారు. అసలు అతడు ఎందుకు నినాదాలు చేశాడో తెలియలేదని.. దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.