Indian Racing League:‘ఇండియన్ రేసింగ్ లీగ్ మొదటిసారిగా మన దేశంలో ట్రాక్ ఎక్కనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం 100 రోజుల కౌంట్ డౌన్ దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ రేసింగ్ ఈవెంట్ను ప్రపంచంలోని పన్నెండు దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్ కూడా ఒకటని గుర్తుచేశారు. ఇప్పుడు హైదరాబాద్లో జరగనున్నది ఈ ఈవెంట్కు సంబంధించిన తొమ్మిదవ సీజన్ అని వివరించారు. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు లండన్, బెర్లిన్, రోమ్, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్ టౌన్, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలివనుంది.
Also Read : Jagadish Reddy : రేపటి విజయం తెలంగాణ అభివృద్ధికి, దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు పునాది
రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకున్నది. ఇప్పుడు హైదరాబాద్లో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ఈవెంట్ను హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) బాధ్యులైన రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల కంపెనీల్లో ఒకటైన గ్రీన్ కో ఈ ఈవెంట్ను ప్రమోట్ చేస్తున్నది. ఈ ఈవెంట్తో అనేక గ్లోబల్ సిటీల స్థాయికి హైదరాబాద్ చేరుకున్నట్లయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు తన సందేశంలో పేర్కొన్నారు.