హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తెరిచిన 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిపై తాము తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత కాలం, హర్మూజ్ ద్వారా జరిగే రాకపోకలను అడ్డుకుంటామని అది హెచ్చరించింది.
ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అమెరికాపై ఆరోపణలు గుప్పించింది. ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారం చేసిన ఒక ప్రకటనలో, ఇరాన్ ఓడరేవులకు వచ్చే, వెళ్లే నౌకలపై నావికా దిగ్బంధనాన్ని కొనసాగించడం ద్వారా అమెరికా తన కట్టుబాట్లను ఉల్లంఘిస్తోందని ఇరాన్ సైన్యం ఆరోపించింది. ఇరాన్కు వచ్చే అన్ని నౌకలకు అమెరికా నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని అది పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులలో, హర్మూజ్ జలసంధి “కఠినమైన నియంత్రణ”లోనే ఉంటుందని కూడా సైన్యం తెలిపింది.
లెబనాన్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇరాన్తో సమగ్ర ఒప్పందం కుదిరే వరకు నావికా దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారం చేసిన ఒక ప్రకటనలో, హోర్ముజ్ జలసంధిపై కఠినమైన నిర్వహణ, నియంత్రణను తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. నావికా దిగ్బంధనాన్ని కొనసాగించడం ద్వారా అమెరికా తన వాగ్దానాన్ని ఉల్లంఘించిందని అది పేర్కొంది.
