Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గతంలో చేసిన విదేశీ కుట్ర ఆరోపణలు మరోసారి తీవ్ర సంచలనంగా మారాయి. ఆయనను అధికారంలో నుంచి దించేయడం వెనుక అమెరికా హస్తం ఉందంటూ అప్పట్లో రేగిన దుమారానికి బలం చేకూర్చేలా, ఒక అత్యంత రహస్య దౌత్య కేబుల్ (టాప్-సీక్రెట్ డిప్లొమాటిక్ కేబుల్) సమాచారం ఇప్పుడు బయటకు పొక్కింది. ‘డ్రాప్ సైట్’ (Drop Site) అనే పరిశోధనాత్మక వార్తా సంస్థ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ను బహిర్గతం చేయడంతో పాక్ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ‘సైఫర్’ (Cypher) గా పిలిచే ఈ పత్రం ‘కేబుల్ I-0678’ గా నమోదై ఉంది. 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం జరగడానికి కొద్ది రోజుల ముందు, అమెరికాలోని అప్పటి పాక్ రాయబారికి, యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి డోనాల్డ్ లూకు మధ్య జరిగిన కీలక సమావేశం వివరాలు ఇందులో ఉన్నాయి.
రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ఉన్న అమెరికాకు పూర్తిగా లొంగిపోకుండా, తాను స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించినందుకే వాషింగ్టన్ తెరవెనుక కుట్రలు చేసి తనను పదవి నుంచి తొలగించిందని ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, విదేశీ ప్రమేయానికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఎలాంటి ఆధారాలు చూపించలేదని అమెరికా ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. మరోవైపు పాకిస్థాన్లోని వారసత్వ రాజకీయ పార్టీలైన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) లు కూడా విదేశీ శక్తులతో చేతులు కలిపి తన ప్రభుత్వాన్ని పడగొట్టాయని ఖాన్ ఆరోపించారు. కానీ, ఆ రెండు పార్టీలు ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ, ఇమ్రాన్ ఖాన్ తొలగింపు పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, ఆయన దేశీయ రాజకీయ వైఫల్యాల వల్లే జరిగిందని వాదించాయి. పాక్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా ఒక ప్రధాని పదవి కోల్పోవడం అదే మొదటిసారి. ఆ తర్వాత ఏడాదికే ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.
ఇప్పుడు డ్రాప్ సైట్ సంస్థ ఈ దౌత్య కేబుల్ను లీక్ చేయడంతో.. గత నాలుగేళ్లుగా పాక్ రాజకీయాలను ఊపేస్తున్న విదేశీ ఒత్తిడి ఆరోపణలకు బలమైన పబ్లిక్ సాక్ష్యం దొరికినట్లయిందని ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI), ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమావేశంలో “అంతా క్షమించబడుతుంది” (all will be forgiven) అనే పదాన్ని వాడినట్లు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇమ్రాన్ ఖాన్ను పదవి నుంచి దించేసి, జైలుకు పంపితేనే అమెరికా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగవుతాయనే అర్థం వచ్చేలా అమెరికా చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు ఈ పదం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు.. సైనిక తిరుగుబాట్లు, రాజకీయ, ఆర్థిక అస్థిరత, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి కారణాల వల్ల పాకిస్థాన్ను ప్రపంచ దేశాలు చాలా కాలంగా ఒక వెలివేసిన దేశంగా (pariah state) చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తన మొదటి విడత పదవీకాలంలో ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ఆ దేశానికి సైనిక సాయాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇస్లామాబాద్తో సంబంధాలు మరింత క్షీణించాయని ఆ నివేదిక పేర్కొంది. అయితే, లీకైన తాజా పత్రాల ప్రకారం.. పార్లమెంటరీ ఓటింగ్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించితే ఇస్లామాబాద్, వాషింగ్టన్ మధ్య సంబంధాలు మెరుగవుతాయని డోనాల్డ్ లూ సూచించినట్లు ఉంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ఆ అవిశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కి ప్రధానిగా కొనసాగితే, పాకిస్థాన్ అమెరికాతో పాటు యూరప్ దేశాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ కేబుల్లో హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది.
