Hyderabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్లో జరిగిన ఘోర ప్రమాదం ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాలను బలితీసుకుంది. రాజేంద్రనగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ మొహిద్దీన్ హుస్సేని (30) సరదా కోసం చేసిన ఒక చిన్న పొరపాటు, ఆయన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. కేవలం నవ్వులాట కోసం అత్యంత విషపూరితమైన పామును చేతుల్లోకి తీసుకోవడం, ఆపై జరిగిన పరిణామాలు ఈ విషాదానికి దారితీశాయి.
రెండు రోజుల క్రితం సయ్యద్ మొహిద్దీన్ తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్కు వెళ్లాడు. అంతా ఆనందంగా గడుపుతున్న సమయంలో, తెల్లవారుజామున ఒక చిన్న కట్లపాము (Common Krait) ఫామ్హౌస్లోకి ప్రవేశించింది. చిన్నగా ఉన్న ఆ పామును చూసి, అది ప్రమాదకరం కాదని సయ్యద్ భావించాడు. సరదాగా దాన్ని చేతిలోకి తీసుకుని, అక్కడున్న స్నేహితులందరినీ భయపెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆ కట్లపాము సయ్యద్ కుడిచేతిపై బలంగా కాటేసింది. అయితే, విషసర్పాల తీవ్రతపై అవగాహన లేకపోవడంతో, తనకు ఏమీ కాదంటూ సయ్యద్ స్నేహితుల ముందు నవ్వుతూ తేలికగా తీసుకున్నాడు. కానీ, కట్లపాము అత్యంత ప్రమాదకరమైన న్యూరోటాక్సిక్ విషాన్ని కలిగి ఉంటుందనే నిజాన్ని గ్రహించలేకపోయాడు. కాసేపటికే సయ్యద్ శరీరంలో మార్పులు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆందోళన చెందిన స్నేహితులు ఆయన్ను తక్షణమే హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో వైద్యులు శ్రమించినప్పటికీ, అప్పటికే విషం శరీరామంతటా పాకడంతో చికిత్స పొందుతూ సయ్యద్ మొహిద్దీన్ హుస్సేని కన్నుమూశాడు. ఈ ఘటనతో సయ్యద్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

