వామ్మో.. మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో మరో హత్య కేసు వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళికతో మొగుడ్ని కాటికి పంపింది నూతన వధువు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటకు వచ్చాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
రాజస్థాన్కు చెందిన ఆశిష్, అంజు భార్యాభర్తలు. 3 నెలల క్రితం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జనవరి 30న నూతన దంపతులిద్దరూ సాయంత్రం భోజనం చేశాక వాకింగ్ చేద్దామంటూ భర్తను బయటకు తీసుకెళ్లింది. అలా ఇద్దరూ ఏకాంత ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొని భర్త చనిపోగా.. భార్య గాయాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా.. తన భర్తను కారుతో ఢీకొట్టి ఆభరణాలు ఎత్తుకుపోయారని చెప్పింది. దీంతో సీసీటీవీలను పరిశీలించగా కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు బయటపడ్డాయి. ఆమె ఫోన్ను పరిశీలించగా ఒక్కసారిగా 180 డిగ్రీల రేంజ్లో కేసు మలుపు తిరిగింది. అసలు విషయం తెలిసి పోలీసులు తీవ్ర షాక్కు గురయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును గుర్తుచేసుకున్నారు.

శ్రీ గంగానగర్ పోలీసు సూపరింటెండెంట్ అమృత దుహాన్ మాట్లాడుతూ.. జనవరి 30 రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. రోడ్డుపై ఒక జంట అపస్మారక స్థితిలో పడి ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చిందని.. సంఘటనాస్థలికి వెళ్లి జంటను ఆస్పత్రికి తరలించామని.. ఆశిష్ చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారన్నారు. తాజాగా పోస్ట్మార్టం రిపోర్టులో ఆశిష్ను గొంతుకోసి చంపినట్లుగా తేలింది. అయితే దర్యాప్తు సమయంలో భార్య అంజు(23) చెప్పిన సాక్ష్యాలకు వ్యత్యాసాలు రావడంతో అనుమానంతో మొబైల్ను పరిశీలించగా ప్రియుడి బంగారం బయటపడింది.
ఆశిష్తో పెళ్లైన దగ్గర నుంచి కాపురం చేయకుండా పుట్టింటిలోనే ఎక్కువగా ఉందని తేలింది. సొంత గ్రామంలో ఇంటి సమీపంలో నివసించే సంజుతో నిత్యం టచ్లో ఉన్నట్లుగా బయటపడింది. ఆశిష్పై ఇష్టంలేక సొంత గ్రామానికి వెళ్లి మాజీ ప్రియుడైన సంజుతో రాజీ పడి అతడితో గడిపింది. దీంతో ఇద్దరు ఆశిష్ హత్యకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే జనవరి 30న భర్తను వాకింగ్ పేరుతో బయటకు తీసుకెళ్లింది. ఏకాంత ప్రాంతానికి వెళ్లినప్పుడు అప్పటికే పొదల్లో దాక్కుకున్న హంతక ముఠా బయటకు వచ్చి దాడి చేసింది. పీక కోసి చంపేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు వాహనం ఎక్కించారు. అటు తర్వాత అంజు ఆభరణాలు తీసి ప్రియుడికి ఇచ్చేసింది. అయితే ఈ ఘటనలో అంజుకి ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి కూపీలాగా ఈ వ్యవహారం వెలుగుచూసింది.
ప్రస్తుతం నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు అంజు, ప్రియుడు సంజు, అతడి సహచరులు రాకీ, సిద్ధార్థలను కూడా అరెస్ట్ చేశారు.
2025, మే 21న ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్ రఘువంశీ నూతన దంపతులు మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. అయితే అప్పటికే సోనమ్.. తన ప్రియుడి సాయంతో హంతక ముఠాను ఏర్పాటు చేసింది. ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి రాజా రఘువంశీని చంపేసి లోయలో పడేసింది. అనంతరం ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లోయలో రాజా మృతదేహం లభించిన కొన్ని రోజులకు సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. నిందితులందరినీ జైలుకు పంపించారు. ఇప్పుడు అదే తరహాలో ఓ నూతన వధువు.. కట్టుకున్న భర్తను కాటికి పంపేసింది. ఇలాంటి సంఘటనలతో పురుషుల్లో భయాందోళనలు మొదలవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటనే భయపడుతున్నారు.