Tirumala: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా 45 డిగ్రీలు, 46 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుపతి దేవస్థానం సమీపంలోని మాఢవీధుల చుట్టుపక్కల్లో ఈ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.
Read Also: AP CEO MK Meena: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
గురువారం ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. జోరు వాన పడింది. అర గంట పాటు ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు ఉపశమనం పొందుతున్నారు. విశేషమేమిటంటే.. కొండ కింద తిరుపతిలో వర్షం లేదు.. కేవలం తిరుమల కొండల్లోనే వర్షం కురిసింది.