తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుంది. ఉత్తరంవైపుగా కదులుతూ రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8కి.మీ వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. కాగా.. ఈనెల 24వ తేదీ తరువాత ఏర్పడనున్న తుఫాన్కు ఒమన్ దేశం సూచించిన ‘రీమల్’ (ఆర్ఈఎంఏఎల్) అని పేరు పెట్టారు. గడచిన మూడు రోజులుగా వాయువ్య భారతంలో తీవ్ర వడగాడ్పులు కొనసాగుతున్నాయి.
READ MORE: Election Commission: తప్పుడు కథనాలపై స్పందించిన ఈసీ.. ఏం చెప్పిందంటే?
కాగా.. శనివారం అనంతపురం రాయదుర్గంలో 38.5మిమీ వర్షపాతం నమోదైంది. విజయవాడ తూర్పులో 34.5మిమీ, విజయవాడ సెంట్రల్ లో 30.2మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 30.5మిమీ , ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 30.5మిమీ, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 29.2మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 27.2మిమీ వర్షపాతం నమోదైంది. దాదాపు 25 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.