గత కొన్ని రోజుల నుండి అనగా ఈ నెల 25వ తేది నుండి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాని తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పత్రికా ప్రకటనను సోమవారం విడుదల చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్సపొందుతున్నానని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండటం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ గారి “AT HOME” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని ఆయన తెలిపారు. అదే విధంగా ముంబాయ్ లో ఈ నెల 27, 28 మరియు 29 తేదీలలో జరుగుతున్న అల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళలేదని ఆయన వెల్లడించారు.
26 వ గణతంత్ర దినోత్సవం రోజున శాసన పరిషత్తు కార్యాలయమునందు కలిసి ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే అడిగారు. ఈ నెల 31వ తేది మధ్యాహ్నము 3.30 గంటలకు ప్రమాణస్వీకారానికి సమయం అడిగారు. దానికి నేను అంగీకరించాను. వీలైతే అదే రోజు మిగితా ఎమ్మెల్సీలతో కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని, నేడు గౌరవ కోదండ రాం మరియు ఇతర నూతనంగా ఎన్నికైన శాసన పరిషత్తు సభ్యులు నాకు సమాచారం ఇవ్వకుండా మా కార్యాలయానికి వచ్చారన్నారు. శాసన మండలి ఛైర్మన్ గా నిస్పక్షపాతంగా నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.