Gummanur Jayaram: నాకెవ్వరితోనూ గొడవల్లేవు.. నాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తానని తెలిపారు మాజీ మంత్రి, తాజాగా టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు మరోసారి చంద్రబాబును కలిసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేను ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేశాక.. బర్తరఫ్ చేసినా.. ఏం చేసినా నాకు అనవసరం అన్నారు. చంద్రబాబు నాకు ఏ పని అప్పజెబితే అది చేస్తా. చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాను. ఆలూరుకు సేవలందించాను.. ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. గుంతకల్లు సీటు మీద కొందరు ఆశలు పెట్టుకోవచ్చు.. కానీ, నేను అందర్నీ కలుపుకుని వెళ్తాను. నాకెవ్వరితోనూ గొడవల్లేవు అని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి మంచి జరగాలని.. చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు గుమ్మనూరు జయరాం.. చంద్రబాబు సమర్ధుడన్న ఆయన.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ కలయిక టీడీపీ-జనసేన కూటమికి ఘన విజయాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆలూరులోని వైసీపీ కేడర్ బయటకొచ్చేసిందని.. వాళ్లు అంతా నాతో ఉంటారని పేర్కొన్నారు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం.. కాగా, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సదస్సు వేదికగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న విషయం విదితమే.