IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో విదేశీ ఆటగాళ్ల లభ్యత కీలక సమస్యగా మారింది. మే 9న లీగ్ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో అనేక విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్లేఆఫ్ దశకు చేరిన పలు ఫ్రాంచైజీలకు తమ ముఖ్య ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ స్వయంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో నేరుగా మాట్లాడుతున్నారు. అలాగే, పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే, ఆటగాళ్ల రాకపై నిర్ణయం తామేమీ తీసుకోబోమని, ఇది అటుగాళ్ల వ్యక్తిగత నిర్ణయమే అని ఆసీస్ క్రికెట్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
Read Also: Meizu Note 16 Series: తక్కువ ధరకే భారీ ఫీచర్లతో వచ్చేసిన మెయిజు నోట్ 16 సిరీస్..!
ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న జరగనుండగా.. వన్డే సిరీస్లు, WTC ఫైనల్ వంటి కీలక అంతర్జాతీయ మ్యాచులు షెడ్యూల్ కావడంతో ఆటగాళ్లు తమ జాతీయ బోర్డుల నుంచి అనుమతులు పొందాల్సిన పరిస్థితి ఉంది. జూన్ 11న జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్, మే 29న వెస్టిండీస్-ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్లు ఉండడంతో ఆ దేశాల ప్లేయర్ల లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఆడే ప్రమాదంలో ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ నుండి యాన్సన్, జోష్ ఇంగ్లీష్ ను కోల్పోనుంది. అలాగే బెంగళూరు జట్టు హేజిల్వుడ్, షెఫర్డ్, ఫిల్ సాల్ట్, బేతెల్ లను కోల్పోనుంది. అలాగే ముంబై ఇండియన్స్ రెకల్టన్, విల్ జాక్స్ లు అందుబాటులో ఉండరు. ఇక గుజరాత్ టైటాన్స్ లో జాస్ బట్లర్, రూథర్ఫర్డ్, కగిసో రబాడా లాంటి స్టార్లు అందుబాటులో ఉండరు. ఈ నాలుగు టీమ్స్ ప్లే ఆఫ్ రేసులో ఉన్న తరుణంలో, తమ కీలక ఆటగాళ్ల సేవలు లేకుండా పోవడం వారికి తీవ్ర ఇబ్బందిగా మారనుంది. మరి బీసీసీఐ ప్రయత్నాలు ఫలిస్తాయా? విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్కు తిరిగి వస్తారా? అన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.