Casino Case: తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈడీ విచారణ రాజకీయ వేడిని పెంచుతోంది. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది.
ఇప్పటికే బుధవారం మంత్రి తలసాని సోదరులైన మహేష్, ధర్మేంద్రలను దాదాపు 10గంటల పాటు ఈడీ విచారించింది. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలు, మనీలాండరింగ్, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ వైద్యులు అంకాలజిస్ట్ వంశీకి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గురునాథ్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎల్, రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. హవాలా చెల్లింపులు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను గతంలో నాలుగు రోజులపాటు ఈడీ విచారించింది. నేడు, రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
Mysuru Bus stop Isuue: మసీదు డోమ్ ఆకారంలో ఉన్న బస్టాప్ కూల్చేయాలి.. ఎన్హెచ్ఏఐ ఆదేశాలు
క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ కుమార్తో సంబంధాలున్న పలువురిని ఈడీ విచారిస్తోంది. క్యాసినో కేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయవేత్తలకు ప్రమేయం ఉందని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న వారికి చెందిన నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దీంతో చీకోటి ప్రవీణ్తో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది.