Fuel Prices: అమెరికా-ఇరాన్ మధ్య ఇన్నాళ్లూ సాగిన యుద్ధ మేఘాలు ఎట్టకేలకు విడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అధికారికంగా సంతకం చేశారు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ముగిసిపోవడంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) సరఫరాకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా క్రూడ్ ఆయిల్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వస్తుందనే ఆశలు చిగురించాయి.
ఈ శాంతి ఒప్పందం ప్రభావం అంతర్జాతీయ చమురు ధరలపై వెంటనే కనిపించింది. యుద్ధ భయాలతో గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 78 డాలర్ల కంటే దిగువకు పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 76 డాలర్ల సమీపానికి చేరింది. దీంతో యుద్ధం కారణంగా పెరిగిన అదనపు భారం (వార్ ప్రీమియం) దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అంతర్జాతీయంగా ధరలు ఇంతలా తగ్గినప్పటికీ, అమెరికాలోని అతిపెద్ద కమర్షియల్ స్టోరేజ్ హబ్ అయిన ‘కుషింగ్, ఓక్లహామా’లో నిల్వలు మాత్రం కేవలం 20 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయాయి. ట్రేడర్ల ప్రకారం ఇది కనీస నిర్వహణ నిల్వల స్థాయి కావడం గమనార్హం.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పతనమైనా.. జూన్ 18, గురువారం నాడు భారతీయ వినియోగదారులకు మాత్రం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ కనిపించలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో ఇంధన ధరలు నాలుగు సార్లు పెరిగాయి. గత నెలలోనే లీటర్ పెట్రోల్పై రూ. 2.6, డీజిల్పై రూ. 2.7 చొప్పున భారీగా పెంచారు. మొత్తంగా చూస్తే యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు లీటరుకు రూ. 7.5 నుంచి రూ. 8 వరకు ధరలు పెరిగాయి. ప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.12, డీజిల్ రూ. 95.20 గా ఉన్నాయి. అలాగే దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన కోల్కతాలో పెట్రోల్ రూ. 113.51 (డీజిల్ రూ. 99.82), ముంబైలో పెట్రోల్ రూ. 111.21 (డీజిల్ రూ. 97.83), చెన్నైలో పెట్రోల్ రూ. 108.01 (డీజిల్ రూ. 99.66) గా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ. 115.73 పలకగా, డీజిల్ రూ. 103.82 వద్ద ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ. 110.89, డీజిల్ రూ. 98.80 గా రికార్డయ్యాయి.
ధరలు తగ్గకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) అండర్-రికవరీలు (నష్టాలు) గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్ 1 నాటికి పెట్రోల్పై లీటరుకు రూ. 24 గా ఉన్న నష్టాలు ఇప్పుడు 83 శాతం తగ్గి రూ. 3 కి చేరాయి. అలాగే డీజిల్పై లీటరుకు రూ. 105 గా ఉన్న నష్టాలు ఏకంగా 75 శాతం తగ్గి రూ. 27 కి పడిపోయాయి. అసలు భారతదేశంలో ఇంధన ధరలు ఎలా నిర్ణయమౌతాయంటే.. మనం వినియోగించే చమురులో ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం కాబట్టి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇక్కడ కీలకం. దీనికి తోడు డాలర్తో రూపాయి మార్పిడి విలువ కూడా ధరలపై ప్రభావం చూపుతుంది. వీటన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ (VAT) పన్నుల వల్లే దేశంలోని వేర్వేరు నగరాల్లో ఇంధన ధరలు వేర్వేరుగా దర్శనమిస్తుంటాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి కాబట్టి, రానున్న రోజుల్లో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయేమో వేచి చూడాలి.

