జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) దేశవ్యాప్తంగా 2021లో నమోదైన కేసులకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. 2021లో తెలంగాణ రాష్ట్రంలో 1,46,131 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది. అయితే.. దేశంలో 52,430 కేసులు నమోదు కాగా.. అందులో 20 శాతం తెలంగాణలోనే నమోదయ్యయని ఎన్సీఆర్బీ పేర్కొంది. గత 2019లో 2,691 కేసులు, 2020లో 5,024 కేసులు నమోదు కాగా.. 2021లో ఏకంగా 10,303కు కేసులు నమోదైనట్లు తాజా నివేదికలో వెల్లడైంది. సైబర్ నేరాలు, ఆహార కల్తీ వంటి కేసుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఆర్థిక నేరాల్లో రెండోస్థానం, వృద్ధులపై దాడుల్లో మూడో స్థానంలో ఉంది.
తెలంగాణలో మహిళల పై దాడులు, చిన్నారుల పై లైంగిక నేరాలు పెరిగాయి. మానవ అక్రమ రవాణాలో తెలంగాణ మళ్లీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మ హత్యల్లో 4 స్థానం, మహిళలపై నేరాలకు సంబంధించి కోర్టులో వీగిపోతున్న కేసుల్లో రాష్ట్రానికి మొదటి స్థానం కాగా.. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా దళిత మహిళలకు అవమానాలు చోటు చేసుకుంటున్నట్లు నివేదికలో తేలింది. ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు 2,180 నమోదు కాగా.. ఓటీపీ మోసాలు 1,377, మార్ఫింగ్ 18, ఫేక్ ప్రొఫైల్ తయారీ 37, ఏటీఎం – 443 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలు కూడా ఎక్కువగా తెలంగాణలోనే 8,690 కేసులు నమోదయ్యాయి.