దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 10వేలకు దిగువన నమోదైన కేసులు.. నేడు మరోసారి 12వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది వైరస్ బారినపడగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినుంచి 9,862 మంది కోలుకున్నారు. క్రమంగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో మొత్తం కేసులు 4,33,31,645కు చేరాయి. ఇందులో 4,27,25,055 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,903 మంది కరోనా రోగులు మృతిచెందారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం 81,687 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, 9,862 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పాజిటివిటీ రేటు 3.94 శాతానికి ఎగబాకింది. రికవరీ రేటు 98.60 శాతానికి తగ్గగా.. క్రియాశీల రేటు 0.19 శాతానికి పెరిగింది. కొత్త కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర(3,659), కేరళ(2,609) నుంచే వచ్చాయి. దిల్లీలో వెయ్యికి పైగా కొత్త కేసులు రాగా.. కర్ణాటక, తమిళనాడు, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 12.28 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.