ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఏపీ విభజన చట్టం-2014 నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తయినట్టు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు.
రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయినట్టు కేంద్రం ఈ లేఖలో తెలిపింది.
Read Also: Revanth Reddy: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా.. 14 సీట్లు గెలుస్తున్నాం
ఆస్తుల విభజన వేగంగా పూర్తయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని.. తాను, రోడ్లు భవనాలశాఖ సిబ్బంది నిరంతరం కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరిపి ఆస్తుల విభజనను ఒక కొలిక్కి తెచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లు చేయలేని పనిని మూడు నెలల్లో పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. ఈ విభజనతో తెలంగాణ భవన్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయని, ఇక తెలంగాణభవన్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
Read Also: Kriti Kharbanda Marriage: ప్రియుడుతో హీరోయిన్ కృతి కర్బందా వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!
ఆస్తుల విభజనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, అధికారులు ప్రతీ సమావేశానికి హాజరై తెలంగాణ ప్రభుత్వ వాదనను బలంగా వివరించడం మూలంగా వేగంగా అనుమతులు సాధించినట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా తెలంగాణ భవన్ నిర్మాణం చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.