ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు (PV Narasimha Rao), చరణ్ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు స్వాగతించాయి. ఇక పీవీ.నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా స్పందించారు.
సోనియాగాంధీ..
పీవీ.నరసింహారావుకి భారతరత్న ఇవ్వడంపై సోనియాగాంధీ (Sonia Gandhi) స్పందించారు. పార్లమెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు. పీవీ నరసింహారావు, చరణ్సింగ్, ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
జైరాం రమేష్..
పీవీ నరసింహారావు, చరణ్సింగ్, ఎంఎస్ స్వామినాథన్లు ఎప్పటికీ వారు భారతదేశపు రత్నాలేనని కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) కొనియాడారు. దేశానికి వారు అందించిన సేవలు అపూర్వమని.. ప్రతీ భారతీయుడు వారిని గౌరవిస్తాడని తెలిపారు. డా.స్వామినాథన్ ఫార్ములా (MSP formula) ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని జైరాం రమేశ్ విమర్శించారు. ప్రధాని మోడీ మొండివైఖరి వల్ల ఉద్యమ సమయంలో 700 మంది రైతులు అమరులయ్యారని, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని జైరాం రమేష్ ధ్వజమెత్తారు.
మల్లిఖార్జున ఖర్గే..
పీవీ నరసింహారావు, చరణ్సింగ్, ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వాగతించారు.