Kejriwal: విషపూరిత పొగమంచుతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత ఈరోజు కూడా తీవ్రంగా ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
కాలుష్య నివారణకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
గాలి కాలుష్యం అధికంగా ఉండటంతో కేజ్రీవాల్ సర్కార్.. నవంబర్ 10 వరకు విద్యాసంస్థలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఢిల్లీలో నవంబరు 13 నుంచి 20 వరకు ఒక వారం పాటు సరి-బేసి నిబంధన అమలు చేయనున్నారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివర సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. బేసి-సరి నిబంధనను మరింత పొడిగించడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
Read Also: Deputy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు డిపాజిట్ కూడా రాదు..
మరోవైపు రోడ్లు, వంతెనలు వంటి పబ్లిక్ ప్రాజెక్ట్లతో సహా నిర్మాణాలు చేపట్టవద్దని తెలిపారు. బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలపై ఢిల్లీ నగరంలోకి నిషేధం కొనసాగుతుందని తెలిపారు. నిత్యావసర వస్తువులతో కూడిన ఎల్ఎన్జి, సిఎన్జి ట్రక్కులను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించనున్నారు. అధిక కాలుష్యం దృష్ట్యా ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం మంది సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.