ఏపీలో అన్నివర్గాల సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. వైద్యారోగ్య, పశుసంవర్థక శాఖలోనూ మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో ముందడుగు పడింది. మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్య (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా రూ.111.62 కోట్లతో రూపొందిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కాయి. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నాయి.
Read Also: Janasena SCST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో నిర్లక్ష్యం సిగ్గుచేటు
ఈ అంబులెన్స్ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 155251ను అనుసంధానించారు. ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. పశువుల యజమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీటిని వాడుకోవచ్చు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను జీవీకే–ఈఎంఆర్ఐకు అప్పగించారు.
సీఎం ప్రారంభించిన వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్లు. డ్రోన్ వీడియో. pic.twitter.com/DKyrY2zVJA
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 25, 2023
కాల్ సెంటర్కు రోజుకు సగటున 1,500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్కాల్స్ రాగా, ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలోమీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది. 2,250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలందించాయి. 6,345 వేలకు పైగా మేజర్, 10,859 మైనర్ శస్త్ర చికిత్సలు చేశారు. అత్యవసర వైద్యసేవల ద్వారా లక్షకు పైగా మూగ, సన్న జీవాల ప్రాణాలను కాపాడగలిగారు. తద్వారా 1.75 లక్షల మంది లబ్ధి పొందారు. మరోవైపు పశు సంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.యస్ నాగిరెడ్డి, వ్యవసాయ, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసీ) వై. మధుసూధన్రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కె. కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు .ఎ, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ ఆర్. అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: US JD Sues Google: భారత్ తరహాలోనే.. అమెరికాలోనూ గూగుల్కి ఇక్కట్లు