జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నోరు తెరిచి అడగలేని, పొరపాటున ఎక్కడైనా, ఎవరైనా పథకాలు పొందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేసే కార్యక్రమే జగనన్నా సురక్షా కార్యక్రమమని ఆయన వెల్లడించారు. జగనన్ను చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్షాను చేపట్టామన్న సీఎం జగన్.. అర్హులైన ఉండి ఏ ఒక్కరూ కూడా పలానా సేవలు కాని, పలానా లబ్ధి కాని అందలేదు అని చెప్పే అవకాశం ఉండకూడదన్నారు. జల్లెడ పట్టి మరీ అర్హులను గుర్తించి పథకాలే కాదు వారికి కావల్సిన డాక్యుమెంటేషన్లుకూడా ఇస్తారని, నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో పరిస్థితులను చూడండన్నారు. ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ వార్డును తీసుకున్నా, ఏ పట్టణాన్ని తీసుకున్నా.. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి అని, లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు గురవుతూ ప్రజలు ఇబ్బంది పడేవారని ఆయన గుర్తు చేశారు. ఏ పనికోసం వెళ్లినా మీరు ఏ పార్టీకి చెందిన వారు అని అడిగేవారని, నాలుగేళ్లలో పరిస్థితిని పూర్తిగా మార్చామన్నారు.
Also Read : Navy Dareness: నౌకా దళం సాహసం.. కాపాడబడిన రెండున్నరేళ్ల బాలుడు
అంతేకాకుండా.. ‘పెన్షన్ కావాలన్నా.. రేషన్ కావాలన్నా నేరుగా ఇంటికే తీసుకువచ్చే గొప్ప వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చాం, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే దీన్ని తీసుకు వచ్చాం, కులం చూడకుండా, మతం చూడకుండా, చివరకు వారు ఏ పార్టీవారో చూడకుండా, రాజకీయాలకు తావే లేకుండా ఎక్కడా ఒక్క రూపాయికూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా పౌరసేవలు అందించడం మన ప్రభుత్వంలోనే ప్రారంభం అయ్యింది, ప్రతిపక్షాలకు అజెండా అన్నది ఏదీ మిగల్లేదు, ఇంతకుముందు రేషన్ కార్డులు కావాలని, ఇళ్లపట్టాలు కావాలని, పెన్షన్లు కావాలని.. ఇంతకుముందు రోజుల్లో చూసేవారు, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వడం, ఇళ్లపట్టాలు కానివ్వండి, ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా.. అత్యంత పారదర్శకంగా, లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు లేకుండా గ్రామస్థాయిలోనే ఇవన్నీ అందుతున్నాయి. అంతకు మించి నవరత్నాల ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే అక్షరాల రూ. 2.16 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా, వివక్ష లేకుండా, అవినీతి లేకుండా డీబీటీ ద్వారా జమచేయడం జరిగింది. ఒక గొప్ప విప్లవం గ్రామ స్వరాజ్యాన్ని ప్రభుత్వాల పాలనలో తీసుకు రాగలిగాం. ఈ విప్లవంలో భాగంగానే అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే తపనతో జగనన్న సురక్షా కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి ముందు ఇప్పటికే అర్హులెవ్వరూ మిగిలిపోకూడదనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జులై, డిసెంబర్ మాసాల్లో మంజూరు చేస్తున్నాం.
Also Read : Navy Dareness: నౌకా దళం సాహసం.. కాపాడబడిన రెండున్నరేళ్ల బాలుడు
దీనికి మరో ప్రయత్నంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్కడైనాకూడా, ఎవ్వరైనా కూడా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో, అందాల్సిన మంచి అందకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదని పేదవాళ్లకు మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో జగనన్నా సురక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాళ్టి నుంచి ప్రారంభమై నెలరోజులపాటు కొనసాగుతుంది. రాష్ట్రంలో ౯౮శాతానికిపైగా అర్హులందరికీ పథకాలు అందుతున్న పరిస్థితి. సాంకేతిక కారణాలో, మరే ఇతర కారణాలవల్లో ఆ ఒక్క శాతం మందికూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో అర్హులకు పథకాలు మంజూరు చేస్తారు. వివిధ సర్టిఫికెట్లు జగనన్న సురక్షా కార్యక్రమంలో జారీచేస్తారు.
ఆదాయం, కులం, బర్త్, కొత్త రేషన్ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్ కు బ్యాంక్ లింకేజి, ఆధార్ కార్డుల్లో మార్పులు… ఇవన్నీకూడా ఈ కార్యక్రమం కింద చేపడతారు. కేంద్రంతో మాట్లాడి ఇప్పటికే 2500 ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేశాం. కేంద్రం ఇప్పటికే ఆధార్ మార్పులకు సంబంధించి విధివిధానాలు ప్రకటించాం. వీటిప్రకారం సేవలను జగనన్నా సురక్షా కార్యక్రమం కింద అందిస్తారు. ఇలా ఎలాంటి సాంకేతిక సమస్యల వల్లనైనా నిజంగా అర్హత ఉండి.. ఏ ఒక్కరైనా, ఎవ్వరైనా మంచి జరగని పరిస్థితి ఉందంటే… దాన్ని సరిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఎలాంటి సర్వీసు ఛార్జీలు కూడా ప్రభుత్వం వసూలు చేయడదు. కార్యక్రమంలో మొదటి అడుగుగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఎవరైనా ఒక టీంగా ఏర్పడి వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటివద్దకూ వెళ్తారు. లబ్ధి అందని వారు ఎవరైనా ఉంటే.. వారందర్నీ కూడా గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు.
వారి దగ్గర నుంచి డాక్యుమెంట్లు సేకరించి… సచివాలయాలకు వెళ్లి సర్వీసు నంబరు రిజిస్టర్ చేసి, టోకెన్ తీసుకుని తిరిగి ఆయా కుటుంబాలకు అందిస్తారు. సంబంధిత సచివాలయాల పరిధిలో ఎప్పుడు క్యాంపులు పెడతారో వారికి తేదీ చెప్పి, ఆరోజు వారిని క్యాంపులకు తీసుకు వచ్చి వారి సమస్యలు పరిష్కరించేలా చూస్తారు. క్యాంపుల సందర్భంగా మండలస్థాయి అధికారులతో కూడిన బృందాలు ఒక రోజంతా సచివాలయాల్లోనే ఉండి… ఈ సమస్యలను పరిష్కరిస్తారు. ప్రతి మండలంలో ప్రతిరోజూ రెండు సచివాలయాలు కవర్ అవుతాయి. జులై 1 నుంచి కూడా ఈ క్యాంపులను నిర్వహిస్తారు. ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఈ సేవలు అందిస్తారు. రాష్ట్రంలోని దాదాపు 5.3 కోట్ల మంది పౌరులందరికీ ఈ సేవలు అందుతాయి. సచివాలయాల సిబ్బంది, ఉద్యోగులు, వాలంటీర్ల సహా లక్షల మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. 26 జిల్లాలకు ప్రత్యేక సీనియర్ అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాం.
అన్ని క్యాంపుల్లో కూడా సేవలు అందుతున్న తీరుపై వీరు తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేస్తారు. వారానికి ఒకరోజు సీఎంఓ, చీఫ్ సెక్రటరీలు మానిటరింగ్ చేస్తారు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా, ఎప్పుడూకూడా చూడని విధంగా పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం, ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా లేకపోవచ్చు. మీ బిడ్డ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుంది.’ అని సీఎం జగన్ అన్నారు.