తెలంగాణకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కోరామని, రాజధాని లేకుండా ఏపీని విభజించారన్నారు. తెలుగుజాతి కోసం సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మించామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే తాను ప్రమాణం చేస్తానని చెప్పానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పుష్కరకాలం కింద అమరావతిని రాజధానిగా నిర్ణయించామని, అది ఇప్పుడు చట్టబద్ధత పొందిందని సీఎం పేర్కొన్నారు.
ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టాను. అమరావతిని చట్టం చేసి 12సంవత్సరాలు అయ్యింది. రాజధానిగా అమరావతిని పార్లమెంట్ ఆమోదించడం ప్రజా విజయంగా భావిస్తున్నా. పార్లమెంట్లో 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి. మిగిలిన పార్టీలు పరోక్షంగా మద్దతు పలికారు. లోక్ సభలో 41 పార్టీలు ఉన్నాయి. 9 పార్టీలు రాజ్యసభలో ఉన్నాయి. అన్ని కలిపి 50 పార్టీలు. నేరుగా చాలా మంది సహకరించారు. ఒకే ఒక్క పార్టీ వైసీపీ మాత్రం ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నం చేసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా వస్తుంది. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ప్రధాని అన్ని విధాలుగా సహకరించారు’ అని సీఎం చెప్పారు.
‘అమరావతి రాజధానిగా ఉండాలని దేశ ప్రయోజనాల కోసం చాలా పార్టీలు ఆలోచించాయి. కానీ వైసీపీ మాత్రం అమరావతిని నాశనం చేయాలని చూసారు. కుట్ర దాటి అమరావతి గెలిచింది. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరిన సందర్భం ఇది. భవిష్యత్లో ఎవరు ఏమి చెయలేని విధంగా జరిగింది. రెండు ప్రాంతాలు సమన్వయం చేయాలనీ ఆనాడు తెలియచేసా. పరిష్కారం కాకుండా విభజన జరిగింది. పోలవరం ఒక సంకల్పం. ఒక 7 మండలాలు తెలంగాణాలో కలిపారు. కానీ ఆనాడు 7 మండలాలు ఏపీకి ఇవ్వాలని ప్రధాని మోడీని కోరాను. నేనెప్పుడూ తెలంగాణాకి వ్యతిరేకిని కాదు. విభజిత ఏపీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇరిగేషన్ కార్యాలయానికి బస్సులో బస చేశా. శివరామక్రిష్ణ కమిటీ రాష్ట్ర రాజధాని కోసం తిరగడం జరిగింది. గుంటూరు విజయవాడ రాజధాని అయితే సిఫార్సు చేసారు. అప్పుడు వైసీపీ నాయకులూ విన్యాసాలు వేసి అందరిని రెచ్చగొట్టారు. అధికార వికేంద్రికరణ చేస్తూనే భవిష్యత్ కోసం ఒక సంకల్పం చేసాము. రెండు ప్రాంతాలకి సమాన దూరం ఉండేలా ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసాము’ అని సీఎం తెలిపారు.
‘వైసీపీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. అమరావతి నాశనం అయినా పర్వాలేదని వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ మనం ‘శాసనం’ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ రాజముద్రతో 5 కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆశయాలు నెరవేరాయి. అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరు. విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ భావోద్వేగాలు ఉన్నాయి. తెలుగు జాతి ప్రయోజనాల కోసం సంపద సృష్టికి ఓ ప్రాంతం తయారుకావాలనే హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చేశాం. రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని ఆ రోజు చెప్పాం. చాలా అంశాలు పరిష్కారం కాకున్నా విభజన జరిగింది. ఆర్ధిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు అన్నీ ఇబ్బందులే. అప్పాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరాను. తెలంగాణాకు నష్టం కలగాలని ఎప్పుడూ కోరుకోను. ఇవాళ హైదరాబాద్లో ఇంతటి సంపద కలిగిందంటే సైబరాబాద్ లాంటి నగరాల నిర్మాణమే. చాలా మంది ఎంపీలు గుర్తించి పార్లమెంటులోనూ ఇది ప్రస్తావించారు. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను. రాజధాని లేకుండా విజయవాడకు వచ్చాం. ఒక ఎస్ఈ కార్యాలయంలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని, బస్సులో బస చేసి కార్యకలాపాలు ప్రారంభించాం. ఏమీ లేకుండా రాష్ట్రం ఏర్పడిందనటానికి అవే ప్రత్యక్ష ఉదాహరణ. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తే 46 శాతం మంది ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్య రాజధానికి ఏర్పాటుకు అనుకూలమని పేర్కొన్నారు. అయితే వైసీపీ చాలా డ్రామాలు ఆడింది. అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఓ రాజధాని ఉండాలని మేం సంకల్పం చేశాం. ఆ సంకల్పంలో భాగమే మూడు ప్రాంతాలకు సమాన దూరంలో ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశాం. రాష్ట్రం మధ్యలో ఉన్న ప్రాంతంగా, కనెక్టివటీ పరంగా, భౌగోళికంగా, చారిత్రాత్మక ప్రదేశంగా రాజధానిగా ఎంపిక చేసి ప్రణాళికలు చేశాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.
