ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం పూర్తి కావాలని, జూలై నెలాఖరుకు ఉన్న ఆటంకాలు తొలిగించాలని సీఎం అధికారులకు చెప్పారు. జాతీయ రహదారులు, రాష్ట్రంలో రోడ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
Also Read: Bengaluru Stampede: హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ!
వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఏ రహదారి నిర్మాణం ఆలస్యం కాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద రూ.11,325 కోట్లతో 770 కిమీ రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు సీఎంకి అధికారులు చెప్పారు. 20,067 కోట్ల విలువైన 1,040 కిమీ రహదారి పనులు పూర్తి కావాలని సీఎం అన్నారు. 1,307 కిమీ పొడవైన అత్యంత రద్దీ కలిగిన 18 రహదారుల డీపీఆర్ రూపొందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 8,893 కిమీ పొడవైన 242 రహదారుల ప్రీ ఫీజబిలిటీ అధ్యయనాన్ని రెండు విడతల్లో చేపట్టాలన్నారు. సీఎం సూచనల మేరకు అదనంగా యలమంచిలి-గాజువాక, గాజులమండ్యం-శ్రీసిటీ రహదారుల్ని కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.