అదనపు భూ సేకరణ వల్ల భూమి విలువ పడిపోతుందనే అపోహలు వద్దు అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేం అన్నారు. రాజధాని పరిధిలో గ్రామ కంఠాల్లో ఉంటూ పట్టాల్లేని వారికి త్వరలోనే పట్టాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం అయ్యారు. ఏ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పర్యటనకు రైతులను ఆహ్వానించారు. రాజధాని మరలా అభివృద్ధి బాట పట్టడం ఆనందంగా ఉందని రైతులు సీఎంతో చెప్పారు.
మే 2న రాజధానిలో ప్రధాని మోడీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్షించారు. రాజధాని పనుల పునః ప్రారంభ సభకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందని సీఎం పేర్కొన్నారు.