Konda Vishweswar Reddy: దేశంలో కుల, మతాలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకీ, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. గురువారం ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని బీహెచ్ఈఎల్, చందానగర్లోని పలు కాలనీలు, పార్కుల్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మరోసారి నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని అన్నారు.
అయితే బీహెచ్ఈఎల్, చందానగర్ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపించొచ్చని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. ప్రచారంలో భాగంగా బీహెచ్ఈఎల్లోని హుడా పార్క్ లో మార్వాడీ సమితి సభ్యులతో కలిసి అల్పాహారాన్ని ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.