Supreme Court: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం తన సమ్మతిని తెలియజేయాల్సిందేనని లేదా తామే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు చేసిన పేర్లను తొక్కి పెట్టడంపై ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ధర్మాసనం ప్రశ్నించింది. “ఇలాగైతే న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుంది?” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్లైన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ గడువును కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై సర్కారు తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. తమ అభ్యంతరం ఏమిటో తెలుపకుండా కొలీజియం సిఫారసు పేర్లను కేంద్రం తొక్కిపెట్టరాదని స్పష్టంచేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన గడువుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉంటున్నాయని ధర్మాసనం తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని అటార్నీ జనరల్కు సూచించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టుకు చెందిన త్రిసభ్య ధర్మాసనం నిర్దిష్ట గడువును విధించిందని, దానిని అమలు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రం తెచ్చిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) చట్టాన్ని సుప్రీం 2015లో కొట్టివేసింది. దీంతో కొలీజియం వ్యవస్థ మళ్లీ అమలులోకి వచ్చింది.
హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన 20 ఫైళ్లను కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు కొలీజియంకు తిప్పి పంపింది. ఆ ఫైళ్లను పునఃపరిశీలించాలని కోరింది. ఈ జాబితాలో తన గే స్టేటస్ గురించి నిక్కచ్చిగా మాట్లాడిన న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరు కూడా ఉన్నదని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి “ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి” అని సూచించింది. కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం. మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది.
Rama Rao Patel Join In BJP: బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన బండి సంజయ్
కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి ‘పరాయి జీవి’ అన్న కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు వ్యాఖ్యపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొంది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్మెహతా స్పందిస్తూ మీడియాలో కొన్ని వార్తలు తప్పుగా వస్తున్నాయని చెప్పారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కావద్దన్నారు.