అమెరికాలో (America) ఇటీవల వరుసగా జరిగిన ఘటనల్లో ఐదుగురు భారత విద్యార్థుల (Indian Students ) మరణాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదని, వాటి వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మీడియాకు వెల్లడించారు.
చనిపోయిన ఐదుగురు భారత విద్యార్థుల్లో ఇద్దరే భారత పౌరులు ఉన్నారని తెలిపింది. మిగిలిన ముగ్గురు కూడా భారత సంతతికి చెందిన అమెరికా పౌరులేనని తెలిపింది. డ్రగ్స్కు బానిసై ఇల్లు లేని ఓ వ్యక్తి.. వివేక్ సైనీ అనే భారత విద్యార్థిని తలపై సుత్తితో 50సార్లు కొట్టి దారుణంగా చంపాడు. సిన్సినాటిలో జరిగిన మరో ఘటనలో మరో భారత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
వీరిద్దరు కాక భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ ఘటనల్లో మరణించారు. వీరిలో వివేక్ సైనీ హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేశారు. విచారణ వేగంగా జరుగుతోంది. ఇక భారత విద్యార్థుల మరణాలపై అమెరికాలోని ఆయా ప్రాంతాల ప్రభుత్వ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని.. మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన సాయం చేస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు.