NTV Telugu Site icon

TG Assembly: సీఎం స్పీచ్‌ను వాక్ ఔట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

Brs Walkout

Brs Walkout

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తాం అన్నారు.. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా లాబీలో హరీష్ రావు మాట్లాడుతూ.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని అన్నారు. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని హరీష్ రావు తెలిపారు.

Read Also: Kishan Reddy: త్రిభాషా పాలసీ కొత్తది కాదు.. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదు

మరోవైపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని తెలిపారు. ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ దే పాపం అని దుయ్యబట్టారు. రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని ప్రశ్నించారు. పులిచింతల పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు తాము కొట్లాడామని హరీష్ రావు పేర్కొన్నారు.

Read Also: Kavitha: కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండి.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి సాధించారని హరీష్ రావు తెలిపారు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ దంపతులు చంద్రబాబును కలిసి భోజనం చేసి వచ్చారు.. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసే లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. మాది త్యాగ చరిత్ర అయితే.. ఉత్తమ్ కుమార్‌ది ద్రోహ చరిత్ర అని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్లనే ఈ రోజు పంటలు ఎండుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.