ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయని, ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదామని, ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో ఆత్మవిమర్శ జరిగిన సంగతి తెలిసిందేనని, ఖమ్మం సమీక్ష ఇది ఏడోసారన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. వచ్చిన తెల్లారినించే మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రేస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని ఆ పార్టీ నెల రోజుల పోకడ స్పష్టమౌతున్నదన్నారు.
అంతేకాకుండా.. ‘వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైంది. ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రేస్ పార్టీ సొంతం. గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదే. 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతర రాజకీయపరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీని తిరస్కరించి కాంగ్రేస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రేస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రేస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీ ని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవం మనం మరువగూడదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రేస్ పార్టీ కి వుండదు అనేది గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైంది. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రేస్ పార్టీ మీద వత్తిడితెస్తూ తెలంగాణ ప్రజలకోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ను గెలిపించింది.
పదేండ్ల అనతికాలం లోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టింది. తెలంగాణ గళం బిఆర్ఎస్.. తెలంగాణ బలమూ బీఆర్ఎస్సే.. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుతున్న తీరుకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్దత కలిగిన బిఆర్ఎస్ కార్యకర్త.. నాయకునిదే. నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్పూర్తితో నిన్నటిదాకా సాధించిన ప్రగతి దీప్తిని. తిరిగి నిలబెట్టుకుందాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనీ గెలిపించుకుందాం. అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలం. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమే. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమ చూశారు. రానున్న రోజుళ్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయి. త్వరలోనే రాష్ట్ర ,జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాల్సిందే.’ అని ఆయన వ్యాఖ్యానించారు.